ఫిలిప్పీన్స్‌ను వణికించిన మూడు వరుస భూకంపాలు.. కుప్పకూలిన ప్రార్థనామందిరం (ఇదిగో వీడియో)

  • రిక్టర్ స్కేలుపై 6.9, 7.0, 7.0గా నమోదు
  • వెల్లడించిన అమెరికా జియాలాజికల్ సర్వే
  • సముద్రంలో అలజడులు ఉండవచ్చని తీర ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక
ఫిలిప్పీన్స్‌లో వరుస భూకంపాలు సంభవించాయి. నిమిషాల వ్యవధిలో రిక్టర్ స్కేలుపై 6.9, 7.0, 7.0 తీవ్రతతో మూడు బలమైన భూకంపాలు సంభవించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో లేటె, సెబు, బిలిరాన్ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో అలజడులు సంభవించే అవకాశం ఉందని స్థానిక భూకంప కేంద్రం హెచ్చరించింది.

ఈ భూకంపాల వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బంటాయన్ ప్రాంతంలో ఒక ప్రార్థనా మందిరం కుప్పకూలిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ప్రజలు భయంతో ఏడుస్తున్నట్లుగా ఉంది.

మొదటి భూకంప కేంద్రం బోహోల్ ప్రావిన్స్‌లోని కాలాపే మున్సిపాలిటీకి తూర్పు-ఆగ్నేయంగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో దాదాపు 33,000 మంది జనాభా నివసిస్తున్నారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌ పరిధిలో ఉండటం వల్ల ఫిలిప్పీన్స్‌లో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.

ఫిలిప్పీన్స్‌లో సంభవించే చాలా భూకంపాలు తక్కువ తీవ్రతతో ఉండటం వల్ల వాటిని ప్రజలు తట్టుకోగలరు. అయితే కొన్నిసార్లు సంభవించే భారీ భూకంపాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. భూకంపాలు ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తాయనే దానిపై కచ్చితమైన సమాచారం అందించే సాంకేతికత ఇంకా అందుబాటులో లేదు.

Philippines earthquake
earthquake Philippines
Philippines
Bohol province
Bantayan
US Geological Survey

More Telugu News